
- కాకా స్పూర్తితో ప్రజలకు సేవ చేస్తాం
- మంత్రి వివేక్ వెంకటస్వామికి అడుగడుగునా ఘన స్వాగతం
పెద్దపల్లి/ సుల్తానాబాద్, గోదావరిఖని వెలుగు: పెద్దపల్లి పార్లమెంటు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని రాష్ట్ర మైనింగ్, ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి శనివారం చెన్నూరు నియోజకవర్గానికి వెళ్తున్న ఆయనకు సుల్తానాబాద్ పట్టణంలో, పెద్దపల్లి మండలం పెద్దకల్వల అందుగులపల్లి గ్రామాల్లో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా ప్రజలు వెంకట స్వామిని మూడుసార్లు, తనను ఒకసారి, తమ కుమారుడు వంశీకృష్ణను పెద్దపల్లి నుంచి పార్లమెంటుకు పంపించారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంతో తమకు విడదీయరాని బంధం ఉందన్నారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను 'గడ్డం' ఫ్యామిలీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. గతంలో తమ తండ్రి వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ అభివృద్ధికి ఎన్టీపీసీ నుంచి రూ. 400 కోట్లు కేటాయించి లక్ష ఉద్యోగాలను కాపాడారని చెప్పారు. కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని, పెన్షన్ సదుపాయాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి శాలువాలు, పూల బొకేలతో నాయకులు ఘనస్వాగతం పలికారు.