జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్రం

జాతీయ క్రీడా అవార్డులను  ప్రకటించిన కేంద్రం

జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ పలువురు క్రీడాకారులను ఈ అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది. అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభతో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించనుంది.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నవంబర్‌ 30న జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ  కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  క్రీడాకారులకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న 2022

2022 సంవత్సరానికి గానూ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ అచంటా గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డును కేంద్రం ఒక్కరికే ప్రకటించింది. ఇందులో భాగంగా ఖేల్‌ రత్న అవార్డుకు ఎంపికైన శరత్ కమల్..రూ. 25 లక్షల ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నాడు. 

అర్జున అవార్డు 2022


2022 ఏడాదికి కేంద్రం మొత్తం 25 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. య్యారు.  అథ్లెటిక్స్ నుంచి సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాష్ ముకుంద్ సాబెల్ సెలక్ట్ అయ్యారు. బ్యాడ్మింటన్ నుంచి లక్ష్యసేన్, HS ప్రణయ్ అర్జున అవార్డు దక్కించుకున్నారు. బాక్సింగ్ నుంచి అమిత్, నిఖత్ జరీన్ అవార్డుకు ఎంపికయ్యారు. చెస్ నుంచి భక్తి ప్రదీప్ కులకర్ణి, ఆర్. ప్రగ్నానంద అర్జున అవార్డును తీసుకోనున్నారు. హాకీ నుంచి దీప్ గ్రేస్ ఎక్కా, జూడో నుంచి సుశీలా దేవి, కబట్టి నుంచి సాక్షి కుమారి, లాన్ బౌల్ నుంచి నాయన్ మౌని సైకియా, మల్లఖంభ్ నుంచి సాగర్ కైలాస్ ఓవాల్కర్ ఎంపికయ్యారు. ఇక షూటింగ్ నుంచి ఎలావేనిల్ వలారివాన్, ఓం ప్రకాశ్ మిథర్వాల్ అర్జున అవార్డు దక్కించుకున్నారు. టేబుల్ టెన్నిస్ నుంచి శ్రీజ అకుల, రెజ్లింగ్ నుంచి అన్షు, సరిత, వుషు నుంచి శ్రీ పర్వీన్ సెలక్ట్ అయ్యారు. పారా బ్యాడ్మింటన్ నుంచి  మానసి గిరిశ్చంద్ర జోషి, తరుణ్ దిల్లాన్, పారా స్విమ్మింగ్ నుంచి స్వప్నిల్ సంజయ్ పాటిల్, డెఫ్ బ్యాడ్మింటన్ నుంచి జెర్లిన్ అనికా అర్జున అవార్డును అందుకోనున్నారు. అర్జున అవార్డీలకు కేంద్రం రూ. 15 లక్షల ప్రైజ్‌మనీతో పాటు  ప్రతిమ, ప్రశంసాపత్రం ఇవ్వనుంది. 

ద్రోణాచార్య అవార్డు 2022: రెగ్యులర్‌ కేటగిరీ
రెగ్యులర్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు 2022కు నలుగురు ఎంపికయ్యారు అర్చరీ నుంచి జీవన్ జోత్ సింగ్ తేజ, బాక్సింగ్ నుంచి మహ్మద్ అలీ ఖమర్, రెజ్లింగ్ నుంచి సుజీత్ మన్, పారా షూటింగ్ నుంచి సుమా సిద్దార్థ్ షిరుర్ ద్రోణా చార్య అవార్డు అందుకోనున్నారు.  

ద్రోణాచార్య అవార్డు 2022: లైఫ్‌ టైమ్‌ కేటగిరీ


లైఫ్‌ టైమ్‌ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు 2022కు ముగ్గురిని కేంద్రం సెలక్ట్ చేసింది. క్రికెట్ నుంచి దినేష్ జవహార్ లాడ్, ఫుట్ బాల్ నుంచి బీమల్ ప్రఫుల్లా ఘోష్, రెజ్లింగ్ నుంచి రాజ్ సింగ్ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు విజేతలకు రూ. 7లక్షల నగదు, పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని కేంద్రం అందివ్వనుంది. 

ధ్యాన్ చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కేంద్రం నలుగురికి ఇవ్వనుంది. అథ్లెటిక్స్ నుంచి  సి. అశ్విని అక్కుంజీ, హాకీ నుంచి ధరమ్ వీర్ సింగ్, కబడ్డీ నుంచి బి.సి సురేష్, పారా అథ్లెటిక్స్ నుంచి నీర్ బహదూర్ గురుంగ్ అవార్డును దక్కించుకోనున్నారు. విజేతలకు రూ. 5 లక్షల నగదు పురస్కారంతో పాటు పతకం, ప్రశంసా పత్రాన్ని అందించనుంది.  

రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌:ఐడెంటిఫికేషన్‌ అండ్‌ నర్చరింగ్‌ ఆఫ్‌ బడ్డింగ్‌ అండ్‌ యంగ్‌ టాలెంట్‌ కేటగిరీలో ట్రాన్స్ స్టాడియా ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. ఎన్‌కరేజ్‌మెంట్‌ టు స్పోర్ట్స్‌ థ్రూ కార్పొరేట్‌ సోషియల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో  కలింగా ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ దక్కించుకుంది. స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అవార్డు కేటగిరీలో లడ్డాక్ స్కి అండ్ స్నో బోర్డ్ అసోసియేషన్ కు అవార్డు దక్కింది. 

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌(ఎమ్‌ఏకేఏ) ట్రోఫీ 2022ని అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీ సొంతం చేసుకోనుంది. యూనివర్సిటీ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు.