- లెక్చరర్ సూర్యదీప్ కిడ్నాప్, అత్యాచారం చేశాడని తల్లిదండ్రుల ఫిర్యాదు
- నిందితుడిపై పోక్సో కేసు నమోదు
శంషాబాద్, వెలుగు : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ వద్ద ఉన్న కృష్ణప్రదీప్ ఐఏఎస్ 21 సెంచురీ అకాడమీలో మైనర్ బాలిక మిస్సింగ్, అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. శంషాబాద్ ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన ప్రకారం.. కృష్ణ ప్రదీప్ 21 సెంచురీ ఐఏఎస్–ఐపీఎస్ అకాడమీ నుంచి ఈనెల 14న ఏపీకి చెందిన ఓ బాలిక (17) మిస్సింగ్ అయినట్లు ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇదే అకాడమీలో హిస్టరీ లెక్చరర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన సూర్యదీప్ మైనర్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని అత్యాచారం చేసినట్లు ఆరోపించారు.
ఈ అకాడమీలో ఇంటర్ నుంచే ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల బాలిక ఇక్కడ కోచింగ్ తీసుకుంటోంది. దీంతో ప్రేమ పేరుతో సూర్య దీప్ ఆ బాలికను లొంగదీసుకుని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూర్యదీప్ పై పోక్సోయాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఏబీవీపీ నాయకులు అకాడమీ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. సూర్యదీప్ను విధుల్లో నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.