న్యూఢిల్లీ: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో ఇండియా ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరిమిత ఈవెంట్లతో జరగనున్న ఈ టోర్నీ ఈ నెల 23న మొదలుకానుంది. ‘ఓవో హైడ్రో వేదికగా జరిగే ఓపెనింగ్ సెర్మనీలో మీరాబాయి, లవ్లీనా ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరిస్తారు. ఇద్దరు విమెన్స్ అథ్లెట్లు ఇండియాకు సారథ్యం వహించడం క్రీడల్లో మన జోష్ను పెంచుతోంది.
ప్రస్తుతం ఈ ఇద్దరు యూకేలో క్రీడల కోసం కఠిన శిక్షణ తీసుకుంటున్నారు’ అని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పేర్కొంది. ఆగస్టు 8వ తేదీతో 32వ పడిలోకి అడుగుపెడుతున్న మీరాబాయి చాను దశాబ్ద కాలంగా భారత వెయిట్లిఫ్టింగ్లో అగ్రగామిగా కొనసాగుతున్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన ఆమె, 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసింది.
2024 పారిస్ ఒలింపిక్స్లో ఆశించిన ఫలితం రాకపోయినా, గ్లాస్గోలో ఇండియాకు పతకం అందిస్తారనే గట్టి నమ్మకం ఉంది. బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన తర్వాత, 2023 ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతం సాధించింది.
