వందకుపైగా గ్రామాల్లో తాగునీటికి కటకట

వందకుపైగా గ్రామాల్లో తాగునీటికి కటకట

నిర్మల్, వెలుగు: ఇన్నాళ్లూ పైపులైన్ల పగుళ్లు, లీకులతో రోజుల కొద్దీ మిషన్​ భగీరథ నీళ్లు నిలిచిపోవడం చూశాం.. కానీ కొత్తగా జీతాలు ఇవ్వక స్టాఫ్​సమ్మెకు దిగడంతో వారం, పది రోజులుగా వాటర్​ నిలిచిపోయిన ఘటన నిర్మల్​ జిల్లాలో జరిగింది. భగీరథ కడెం గ్రిడ్​లో పని చేస్తున్న దాదాపు 100 మంది క్షేత్రస్థాయి సిబ్బంది పది రోజుల నుంచి వేతనాల కోసం సమ్మె బాట పట్టారు. వీరంతా డ్యూటీలకు వెళ్లకుండా ఆందోళన చేస్తుండడంతో గ్రిడ్​ పరిధిలోని మూడు మండలాల్లో సుమారు వంద గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడ్తున్నారు.

ఐదు నెలలుగా జీతాల్లేక సమ్మెలోకి.. 

కడెం గ్రిడ్​ పరిధిలో నిర్మల్ ​జిల్లాలోని దస్తూరాబాద్, జన్నారం, కడెం మండలాలతో పాటు పెంబి, ఖానాపూర్​ మండలాల్లోని కొన్ని గ్రామాలు  ఉన్నాయి. ఈ గ్రిడ్​ను హైదరాబాద్ ​కేంద్రంగా పనిచేసే పీఎల్ఆర్​అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ మరో సబ్​కాంట్రాక్టర్​కు పనులు అప్పజెప్పింది. ఈ సబ్​కాంట్రాక్టర్​ గ్రిడ్​లో పనిచేసే వాటర్​ లైన్​మెన్లు, సూపర్​వైజర్లు తదితర సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా  వేధిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. రూల్​ ప్రకారం ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 15,212 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ. 7 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆ వేతనం కూడా ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖానాయక్, మిషన్​ భగీరథ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ  సమస్య  పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు.  

నీటి సరఫరాకు ఆటంకాలు

సిబ్బంది సమ్మె వల్ల కడెం, దస్తూరాబాద్, జన్నారం మండలాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పెంబి, ఖానాపూర్​ మండలాల్లోని కొన్ని గ్రామాలకు కూడా వాటర్​సప్లై బంద్​అయింది.  దీంతో వారం, పదిరోజులుగా వంద గ్రామాల్లో తాగునీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. చాలామంది బోరు​ నీళ్లు తాగుతుండగా, కొందరు మినరల్​వాటర్​కు ఎగబడ్తున్నారు. ఇదే అదనుగా మినరల్​ వాటర్​ రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఇటీవల అధికవర్షాల వల్ల బోరువాటర్​ కలుషితమైందని, తద్వారా వైరల్​ ఫీవర్స్​తో పాటు వివిధ రోగాలు వచ్చే ప్రమాదముందనే భయాందోళన వ్యక్తమవుతోంది.    

త్వరలోనే పరిష్కరిస్తాం

మిషన్ భగీరథ సిబ్బంది ఐదు నెలల వేతనాల కోసం సమ్మె చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రెండు రోజుల క్రితం సబ్ కాంట్రాక్టర్ వచ్చి సిబ్బందితో చర్చించారు. ఈ నెలాఖరులోగా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేలా  చర్యలు తీసుకుంటాం.  

– వెంకటరమణ, డీఈ, మిషన్ భగీరథ, కడెం గ్రిడ్

ఎనిమిది దినాలుగా నీళ్లొస్తలేవ్

ఎనిమిది రోజులుగా తాగే నీళ్లు వస్తలేవు. నల్లాలు పని చేస్తలేవు. సర్పంచ్, ఆఫీసర్లకు సమస్య చెప్పినం. ఇప్పుడు బోరుబావి నీళ్లు తాగుతున్నం. నల్లా నీళ్లు ఎప్పుడొస్తయంటే ఎవలూ చెప్తలేరు. 

– శనిగారపు నర్సవ్వ, కన్నాపూర్, కడెం మండలం

ఆఫీసర్లు పట్టించుకుంటలేరు

మొన్నటి దాకా వర్షాలు, వరదలు అంటూ భగీరథ నీళ్లు బంద్​పెట్టిన్రు. మధ్యలో కొద్దిరోజులు ఇచ్చి మళ్లీ వారం రోజుల నుంచి సప్లై పూర్తిగా ఆపేసిన్రు. మా సమస్య ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు. భగీరథ సిబ్బంది సమ్మె చేస్తున్నరని చెప్తున్నరు. సిబ్బంది సమ్మె చేస్తే మా గొంతు ఎండల్నా?

– బొంతల లక్ష్మీరాజం, కన్నాపూర్, కడెం మండలం