
నవోదయ విద్యాలయాల సమితి నిర్వహించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) టెన్త్ పరీక్షల మెమోల్లో తప్పులు దొర్లాయి. తెలంగాణలోనూ, హైదరాబాద్ రీజియన్ పరిధిలోకి వచ్చే ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లోనూ టెన్త్ పరీక్షల మెమోల్లో మెయిన్ సబ్జెక్టుగా ఆ లోకల్ భాష కాకుండా హిందీ పేరు పడిందని పేరెంట్స్, అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ నవోదయ రీజియన్ రాష్ర్టాల పరిధిలో మొత్తం 5,391 మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. మార్చిలో జరిగిన సీబీఎస్ఈ టెన్త్ యాన్యువల్ పరీక్షలకు తెలంగాణలోని 9 నవోదయ స్కూల్స్ నుంచి 700కు పైగా స్టూడెంట్స్ పరీక్ష రాశారు. మే 6న సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు విడుదల చేయగా, మెమోల్లో మెయిన్ సబ్జెక్టు పేర్లలో ఉండాల్సిన తెలుగు సబ్జెక్ పేరును, అడిషనల్ సబ్జెక్ట్గా చూపించారు. ఈ విషయాన్ని పేరెంట్స్ అధికారుల దృష్టికి తీసుకుపోగా, వారు రీజినల్ అధికారులకు లేఖ ద్వారా సమస్యను వివరించారు. ఈ తప్పును సరిచేసి మెయిన్ మెమోలు పంపిస్తారని భావించిన పేరెంట్స్, స్టూడెంట్స్ కు నిరాశే మిగిలింది. రెండు రోజుల క్రితం విద్యార్థులకు అందిన లాంగ్ మెమోల్లోనూ గతంలో ఉన్నట్టే తెలుగు అడిషనల్ సబ్జెక్ట్గా ఉంది. ఇలాంటి తప్పిదమే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లోనూ జరిగిందని అధికారులు చెప్తున్నారు. మెయిన్ సబ్జెక్టుల్లోనే లోకల్ భాషకు బదులు, హిందీ సబ్జెక్ట్ పేరు ప్రింట్ చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వెంటనే లాంగ్మెమోల్లోని తప్పులను సరిచేసి, కొత్త మెమోలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.