
ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ ఆదివారం (మే 18) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కీలక మార్పులు చేసింది. మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ పంజాబ్ జట్టులోకి చేరకపోవడంతో యువ సంచలనం మిచెల్ ఓవెన్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించాడు. గాయపడిన గ్లెన్ మ్యాక్స్ వెల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ రీప్లేస్ మెంట్ గా ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ ఓవెన్ను ఎంపిక చేసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ తరపున ఆడుతున్న ఈ ఆసీస్ ఓపెనర్ రూ.3 కోట్లకు పీబీకేఎస్లో చేరాడు. ఐపీఎల్ లో అవకాశం రావడంతో ఓవెన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ వదిలేసుకోనున్నాడు.
ఎవరీ మిచెల్ ఓవెన్..?
మిచెల్ ఓవెన్ 2024-25లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. హోబర్ట్ హరికేన్స్ తరపున 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 452 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో ఓవెన్ కేవలం 42 బంతుల్లో 108 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. బిగ్ బాష్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఈ మెగా ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ చేసి పాకిస్థాన్ సూపర్ లీగ్ లో.. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంపికయ్యాడు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన మిచెల్ ఓవెన్ తన తొలి మ్యాచ్ లో డకౌటయ్యాడు. ఆడిన రెండో బంతికే మఫాకా బౌలింగ్ లో సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నాలుగు ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ఆర్య (9), ఓవెన్ (0), ప్రబ్ సిమ్రాన్ సింగ్ (21) విఫలమయ్యారు.