మియాపూర్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్

మియాపూర్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్
  •       పీఎస్ కు వచ్చిన మహిళను  తిట్టినట్లు ఆరోపణలు
  •      విచారణ చేపట్టి సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ

చందానగర్​, వెలుగు : భర్తతో గొడవ కారణంగా మియాపూర్ పీఎస్ కు వచ్చిన మహిళను తిట్టడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ సీపీ అవినాష్​మహంతి సస్పెండ్ చేశారు.  2007 బ్యాచ్ కు చెందిన ప్రేమ్ కుమార్ 2023 జులై నుంచి మియాపూర్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. 4 నెలల కిందట ఓ మహిళ భర్తతో ఉన్న గొడవ కారణంగా మియాపూర్​ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు 498 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసిన మియాపూర్  ఇన్​స్పెక్టర్ ప్రేమ్​కుమార్​దర్యాప్తు చేపట్టారు.

అయితే,ఈ కేసు విషయంలో సదరు మహిళతో ప్రేమ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తిట్టాడు. దీంతో ఆ మహిళ సైబరాబాద్ సీపీ అవినాష్​మహంతిని కలిసి ఇన్​స్పెక్టర్​ వేధింపులకు సంబంధించి ఆధారాలను సమర్పించింది. దీంతో సీపీ అవినాష్ మహంతి విచారణ జరిపించారు. ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

నెల రోజుల కిందట మియాపూర్ పీఎస్ లో పనిచేసిన ఎస్సై గిరీష్​సైతం ఓ కేసు విషయంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి సస్పెన్షన్ కు గురయ్యాడు. నెల రోజుల వ్యవధిలో ఒకే పీఎస్ లో ఇన్ స్పెక్టర్, ఎస్సై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.