ఉత్తమ్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇప్పిస్తా : ఎమ్మెల్యే బొల్లం

ఉత్తమ్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇప్పిస్తా : ఎమ్మెల్యే బొల్లం

కోదాడ : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి, తమ పార్టీ నుంచి పోటీ చేస్తే తాను స్వాగతిస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తమ అధినేత, సీఎం కేసీఆర్ కు చెప్పి తానే దగ్గరుండి పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘రచ్చబండ’ కార్యక్రమం పేరుతో గ్రామాల్లో తిరుగుతుండడంతో ఓట్ల కోసం వచ్చారా..? అంటూ ప్రజలే బుద్ధి చెబుతున్నా ఉత్తమ్ కు మాత్రం బుద్ధి రావడం లేదన్నారు. 

ఆర్టీసీ బస్సులో కోదాడకు వచ్చిన ఉత్తమ్ కు కారులో కాల్చుకునే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. కోదాడ నియోజకవర్గం ప్రజలు రాజకీయ భిక్ష పెడితే రాత్రికి రాత్రే నియోజకవర్గాన్ని వదిలి ఎందుకు పారిపోయిండో సమాధానం చెప్పిన తర్వాతే రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. కోదాడలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్  పార్టీనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.