- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, అసైన్మెంట్ భూములు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, రెయిన్బో మెడోస్ కాలనీలో ప్రభుత్వ భూమి వివాదంపై తహసీల్దార్ వెంకటేశ్, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కృష్ణతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు, రెవెన్యూ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, డెవలపర్స్తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇళ్లను కొనుగోలు చేసిన కాలనీ వాసులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.
అందరి సమక్షంలో మారోమారు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ, అసైన్మెంట్ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురికాకుండా రక్షణకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు.
గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ పార్కులు, రహదారులను కబ్జా చేసి డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తే చట్ట రీత్య చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్ని హెచ్చరించారు. కొన్ని మండలాలలో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థలాలను, ఆఫీసులను, కమ్యూనిటీ ఫంక్షన్హాల్స్, విద్యాసంస్థలను ఇతర వాటినికి వినియోగిస్తామన్నారు.
