
- ప్పుడు కేసులు, దొంగ మాటలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్
- కార్యకర్త కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత
గజ్వేల్, వెలుగు: హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని గత ప్రభుత్వ పథకాలకు కోతలు పెడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి మక్తా గ్రామానికి చెందిన చాకలి కనకయ్య గత నెల వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరై తిరిగివస్తూ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుటుంబానికి ఆదివారం ఆయన రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
అనంతరం ములుగు మండలం వంటిమామిడి, మండల కేంద్రం మర్కూక్లను సందర్శించి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం జగదేవ్పూర్ మండలం తిగుల్గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ను ఆయన ప్రారంభించారు. రజతోత్సవ సభ సందర్భంగా కార్యకర్త కనకయ్య మృతి బాధాకరమన్నారు. కనకయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించామన్నారు. కార్యకర్తలే సొంతంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కార్యకర్తలు పనిచేయాలన్నారు.
సంక్షేమ పథకాలు అటకెక్కించారు
రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిగా నిల్చిన తెలంగాణ తల్లిని రేవంత్రెడ్డి మార్చిండన్నారు. రాష్ట్రంలో ఆయన తెచ్చిన మార్పు తల్లిని మార్చడమని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యమంలో ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి దొంగ కేసులు, దొంగ మాటలతో పబ్బం గడుపుకుంటున్నాడన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కేసీఆర్ కిట్, రైతుబంధు, పంట రుణమాఫీ వంటి పథకాలను అటకెక్కించటం అన్యాయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేశారని, ఇందుకు జహీరాబాద్ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైటు వెలుగులో చికిత్స చేయడం పరాకాష్ట అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఆసుపత్రుల్లో మందులు, సూదులు, జనరేటర్లలో డీజిల్ లేకపోవడం కాంగ్రెస్ పాలన తీరుకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు. గజ్వేల్ లో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో వంద పడకల మాతా శిశు ఆసుపత్రి ప్రారంభించగా వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి, వర్గల్ మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు సంతోష్ వెంకటేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బాలు యాదవ్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, నాయకులు రమేశ్ గౌడ్, వేలూరి కృష్ణారెడ్డి, భీమ్ రెడ్డి, భాస్కర్ గౌడ్, లింగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.