హైవే విస్తరణలో 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ; ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

హైవే విస్తరణలో 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ; ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రజల సౌకర్యం కోసం ఐదు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్​ బ్రిడ్జిలు నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నేషనల్​ హైవే అథారిటీ, కాంట్రాక్ట్ సంస్థ, ట్రాఫిక్​, పోలీసు అధికారులతో కలిసి ఫుట్ ఓవర్​ బ్రిడ్జిలు నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు జాతీయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని బీహెచ్ఈఎల్​ చౌరస్తా నుంచి సాకి చెరువు వరకు ఐదు చోట్ల ఫుట్ ఓవర్​ బ్రిడ్జిలు నిర్మిస్తామని చెప్పారు. అశోక్​ నగర్​, బీరంగూడ ఐఐటీ, ఆర్సీపురం రైల్వే లైన్, పటాన్​చెరు బస్టాండ్, సాకి చెరువు ప్రాంతాల్లో వీటిని నిర్మించబోతున్నట్లు వివరించారు. 

నిర్ధేశిత గడుపు లోపు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్​ హైవే అథారిటీ డీఈ రామకృష్ణ, డీఎస్పీ ప్రభాకర్, సీఐలు వినాయక్​ రెడ్డి, లాలూ నాయక్​, ఎక్సైజ్​ సీఐ పరమేశ్వర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శాస్ర్తీ, రమేశ్​ పాల్గొన్నారు.