ముషీరాబాద్, వెలుగు: వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు రూ.350 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి పనులను జూన్లోగా పూర్తి చేసి జనాలకు అందుబాటులోకి తీసుకొస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2.6 కి.మీ పొడవు, 4 లేన్లతో నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జి డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని భావించామని.. కానీ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లు, హై టెన్షన్ వైర్ల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ మొత్తం 81 పిల్లర్లకుగాను 78 పిల్లర్లను నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యే వెంట డీఈ సుదర్శన్, ఈఈ గోపాల్, అధికారులు ఉన్నారు.