- అంగన్వాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిపై ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ, వెలుగు: అంగన్వాడీ ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వారిపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభను జనగామ జిల్లా యశ్వంతాపూర్ సమీపంలోని టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సభకు హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నల్లా భారతి మాట్లాడుతుండగా అడ్డు చెప్పారు. మెడలో పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పారు. తాము ఉద్యోగస్తులమని, పార్టీ కండువా వేసుకోవద్దని ఆమె ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ‘మీకు ఏ అసౌకర్యం కలిగినా మాదే బాధ్యత, మీరు మా పార్టీలో భాగం, మా కడుపుల ఇసం ఉండదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతం. మీరు తప్పకుండా పార్టీ కండువా కప్పుకోవాలే.. లేదంటే మేం మీటింగ్నుంచి వెళ్లిపోతం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతి మరోసారి ఎమ్మెల్యేకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దాంతో టీఆర్ఎస్ కేవీ అని ఉన్న పార్టీ అనుబంధ సంఘం కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే సంతృప్తి చెందలేదు. ‘అన్నా మేం ఉద్యోగస్తులం, పార్టీ కండువా వద్దు’.. అని మరోసారి నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే అయిష్టంగానే ప్రోగ్రాంలో పాల్గొన్నారు.