- ఇద్దరి మధ్య సమసిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ రాజేసిన ఎమ్మెల్యే
- సమ్మక్క జాతర సమయంలో మతం పేరుతో దూషించి..
- వెంటనే క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
- తాజాగా పర్సనల్ ఇష్యూస్ తో సీపీపై మళ్లీ అటాక్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం టార్గెట్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. వీణవంక సమ్మక్క జాతర సమయంలో హుజూరాబాద్లో సీపీని ఉద్దేశించి ఎమ్మెల్యే మతం పేరుతో దూషించి, ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. సమసిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ ఎమ్మెల్యే రాజేయడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి మరింత పర్సనల్గా సీపీపై, పలువురు పోలీసాఫీసర్లపై అటాక్ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం చివరికి ఎటుదారితీస్తోందనన్న చర్చ సాగుతోంది. ఈ విషయమై పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతుండగా.. సీపీ మాత్రం పరువునష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు..
కరీంనగర్లోని ఎస్ఎన్ మాల్ నుంచి రూ.25 లక్షలు ముడుపులు తీసుకున్నారని, రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ సృజన్రెడ్డి ఈ డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి వెళ్లే సీపీ భార్య కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను వెంట పంపుతున్నారని, హైదరాబాద్ లో ఉండే తన తండ్రి కోసం, అలాగే కరీంనగర్లో ఉండే తన అన్న కోసం పోలీస్ వాహనాలను వినియోగిస్తున్నారంటూ సీపీ కుటుంబ సభ్యులే టార్గెట్ గా ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. గ్రానైట్, ఇసుక క్వారీల నుంచి, ట్రాన్స్ ఫర్ల కోసం హోంగార్డుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఆయన ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారని.. వీటికి సంబంధించిన వీడియో ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు.
పోలీసాఫీసర్లు ఏం చెప్తున్నారంటే..
వీణవంక సమ్మక్క జాతర విషయంలో హైకోర్టు ఆర్డర్ను అమలు చేసే క్రమంలోనే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, కానీ అక్కడ పోలీస్ విధులను అడ్డుకోవడమేగాక సీపీపై, డ్యూటీలో ఉన్న సీఐ సృజన్ రెడ్డిపై ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగారని, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసాఫీసర్లు చెప్తున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదని డ్యూటీ చేసిన తమపై ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కక్షగట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పని అర్థం చేసుకుని వెంటనే పశ్చాత్తపం ప్రకటించారని, కానీ నాటి విషయాన్ని మనసులో పెట్టుకుని కౌశిక్రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారని గుర్తుచేస్తున్నారు. సీపీ కుటుంబ సభ్యులను ఈ వివాదంలోకి లాగడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీపీ సతీమణి చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కాదని, ఆమె హాస్పిటల్ మేనేజ్ మెంట్ కోర్సు ఇంటర్న్షిప్ చేస్తున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. ఉద్యోగానికి, ఇంటర్న్ షిప్కు తేడా తెలియకపోతే ఎలాగని, ఎమ్మెల్యేకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఎన్వోసీ కోసం ఎస్ఎన్ మాల్ నుంచి సీపీ, ఇతర పోలీసాఫీసర్లు రూ.25 లక్షలు వసూలు చేశారని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను మాల్ మేనేజింగ్ పార్ట్నర్శ్రీధర్రెడ్డి ఖండించారు. ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని, వాటిల్లోనిజం లేదన్నారు. తమ మాల్ త్రీటౌన్ పీఎస్పరిధిలోకి వస్తుందని, కానీ తమ మాల్తో సంబంధం లేని టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పేర్లను ఎమ్మెల్యే ఈ వివాదంలోకి లాగారని తెలిపారు.
జిల్లాల పునర్విభజన సందర్భంగా వర్క్ టూ ఆర్డర్ మీద హోంగార్డులు కొత్త జిల్లాలకు వెళ్లారని, ఇతర జిల్లాల్లో నాలుగైదేళ్ల క్రితమే వారి సొంత జిల్లాల్లో అడ్జస్ట్ చేయగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్లో ఉందని తెలిపారు. హోంగార్డులు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించగా.. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యకు సీపీ గౌష్ ఆలం పరిష్కారం చూపారని, ఈక్రమంలో అవినీతి ఆరోపణలు వస్తే ఆర్ఐని ట్రాన్స్ ఫర్ చేశారని గుర్తు చేస్తున్నారు. గౌష్ ఆలం కరీంనగర్ వచ్చాక అప్పటికే సీపీ ఇంట్లో పనిచేస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ను, ఇతర కానిస్టేబుల్ ను డ్యూటీలకు పంపించారని, మొత్తం సిబ్బందిని నలుగురికి కుదిస్తే 20 మంది కానిస్టేబుళ్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తున్నారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండ చూడడమే తమ డ్యూటీ అని, తామెవరికీ అనుకూలంగా వ్యవహరించమని, మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ సర్వీస్ చేసింది తామేనని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యల్ని వాపస్ తీసుకోవాలని పోలీసు సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియోలపై సర్వత్రా ఆసక్తి
సీపీపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరో 15 రోజుల్లో విడుదల చేస్తానన్న వీడియోలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో అందులో ఏం ఉండి ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణల వెనక పోలీస్ శాఖలో ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల నుంచి వసూళ్లు, అవినీతి వ్యవహారంలో ఇటీవల సస్పెండైన సబ్ ఇన్స్పెక్టర్ హస్తం ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. సస్పెండైన తర్వాత తనే సీపీ కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సదరు ఎస్సైపై పోలీస్ శాఖ తీసుకోబోయే శాఖాపరమైన చర్యలు తీవ్రంగా ఉండే అవకాశముంది.
పరువునష్టం దావాకు సిద్ధమవుతున్న సీపీ?
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు సీపీ గౌష్ ఆలం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు సమ్మక్క జాతర సమయంలో పాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముందుగా లీగల్ ఒపినీయన్ తీసుకుని, దాని ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశముంది. ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగడంపై ఐపీఎస్ అధికారుల సంఘం కూడా రియాక్ట్ కానున్నట్లు తెలిసింది. అంతేగాక పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై త్వరలో మరో కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.
