
ఆర్మూర్, వెలుగు: రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని, జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఇటీవల వేసిన వెంచర్లలో 10 శాతం భూమిని మున్సిపాలిటీకి ఇవాల్సిందేనన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా మొరం ఇస్తామన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి, సమస్యలపై మాట్లాడారు.
అధికారులతో కలిసి ప్రభుత్వ నూతన భవన నిర్మాణాల కోసం తహసీల్దార్, ఆర్డీవో ఆఫీస్ చుట్టూ ఉన్న స్థలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీవో రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిగోట గంగాధర్, జాగిర్ధార్ శ్రీనివాస్, సారంగి సందన్న తదితరులు ఉన్నారు.
నిధుల మంజూరుకు వినతి
ఆలూర్ చెరువు కట్టపై గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి, చేపల మార్కెట్, కమ్యూనిటీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. 20 శాతం కంట్రిబ్యూషన్ చేస్తే 80 శాతం నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటన్న, ఆలూరు అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు సాయిలు, సంఘం సెక్రటరీ సుమన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.