రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలకు హద్దూ అదుపు లేకుండా పోతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వ భూములను, ప్రాజెక్టులకు కేటాయించిన భూములను బీఆర్ఎస్ లీడర్లు ఆక్రమించారని ఆరోపించారు. ప్రాజెక్టులకు కేటాయించిన భూములను ఆక్రమించి వ్యవసాయ శాఖ మంత్రి 3 ఫాంహౌజ్ లు కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ఫాంహౌజ్ కట్టారని వెల్లడించారు. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు.
మంత్రి ఫాంహౌజ్ కట్టుకున్న మండలంలో21అక్టోబర్ 2021న తహసీల్దార్ కార్యాలయం తగలబడిందని రఘునందన్ రావు వెల్లడించారు.తహసీల్దార్ ఆఫీస్ తగలబడ్తే పోలీసులు ఇంత వరక చార్జ్ షీట్ వేయలేదన్నారు. కార్యాలయం తగలబడితే పాత రికార్డులేవీ ఉండవు కాబట్టి మంత్రి యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించారని వెల్లడించారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమిలో మంత్రి ఫాంహౌజ్ కట్టారని ఆరోపించారు. దుబ్బాకలో తండాలకు రోడ్లు కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కు విజ్ఞప్తి చేసినా నిధులు మంజూరు చేయలేదని.. కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఫాంహౌజ్ రోడ్డుకు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేశారని ఆరోపించారు.
అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు కట్టిండని ఈటలను మంత్రి పదవి నుంచి తీసేసిన్రు..అంతకు ముందు ఓ ఎస్సీ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించారు.. ఎస్సీ, బీసీలకు ఒక న్యాయం,అగ్రనాయకులకు ఒక న్యాయమా? కేసీఆర్ అంటూ ప్రశ్నించారు రఘునందన్ రావు. దమ్ముంటే తాను చేసిన ఆరోపణలను తప్పని రుజువు చేయాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు కేటాయించిన భూములను కబ్జా చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని వెంకటేశ్వరస్వామి గుడిలో వ్యవసాయశాఖ మంత్రి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.