మెదక్ టౌన్, వెలుగు: పల్లెల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, అధికారం ఉంటేనే గ్రామాలు అభివృద్ధిపథంలో ఉంటాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మొదటి, రెండో విడతల్లో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఆనందంగా ఉందన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ వారందరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు.
ఇతర పార్టీలు బలపరిచిన సర్పంచ్ లు, స్వతంత్రులుగా గెలిచిన సర్పంచ్లు ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుప్రభాత రావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మధుసూదన్ రావు, అశోక్, కృష్ణ, ఆంజనేయులు, రమేశ్, శివరామ కృష్ణ, ప్రశాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హాఫీజ్, రమేశ్ రెడ్డి, మండల పార్టీల అధ్యక్షులు గోవింద్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
