- ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
కౌడిపల్లి, వెలుగు: రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు దోహద పడతాయని, వాటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద సొసైటీ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. వ్యవసాయ అవసరాలకు రుణాలు అందించడంతోపాటు, ధాన్యం కొనుగోలు చేపడుతున్నారన్నారు. దళారీల భారీ నుంచి రైతులను కాపాడడమే గాక వడ్ల కొనుగోలు కమిషన్ ద్వారా సంఘం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.
రైతులు ఆయిల్ పామ్ పంట వేసుకోవాలని సూచించారు. సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నామని, ఆసక్తిగల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సంఘం రూ.1.50 కోట్ల లాభాల బాటలో నడుస్తుందన్నారు. సైబర్ క్రైమ్ పై రైతులకు సీఎఫ్ ఎల్ కౌన్సిలర్ దుర్గేశ్, ఆసిఫ్ అవగాహన కల్పించారు.
రైతులు ఫోనుకు వచ్చే ఎలాంటి బ్యాంకు ఓటీపీలు, లింకులు ఓపెన్ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్చైర్మన్ చిన్నంరెడ్డి, సహకార శాఖ అధికారి రాజ్ కిరణ్, ఆయిల్ పామ్ డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏఓ స్వప్న జాదవ్, సొసైటీ సీఈవో దుర్గాగౌడ్ పాల్గొన్నారు.
