మరోసారి కడియంపై ఎమ్మెల్యే తాటికొండ సంచలన కామెంట్స్

మరోసారి కడియంపై ఎమ్మెల్యే తాటికొండ సంచలన కామెంట్స్

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ లో కడియం వర్సెస్ తాటికొండ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ కడియంపై వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య.

‘‘ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగుల్లా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. స్టేషన్ ఘనపూర్ లో నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండే. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. నీతిమంతుండని మాట్లాడుతున్నావు. నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు అంతే. కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం. మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం పని చేశావో అన్నీ నాకు తెలుసు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. అవసరం వచ్చినప్పుడు పుస్తకం బయటపెట్టి.. నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ బయటపెడుతా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని కుదవపెట్టి సింగపూర్, మలేషియాలో ఆస్తులు సంపాదించావు’’ అంటూ కడియంపై ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం హిమ్మత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘2014, 201 8 ఎన్నికల కోసం నా ఆస్తులన్నీ అమ్ముకున్నా. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర నాదయితే.. ఆస్తులు కొనుక్కున్న చరిత్ర నీది. ఎప్పుడు రానిది మళ్లీ మీ ముందుకు ఊసరవెల్లి మాదిరిగా వస్తున్నాడు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ దొంగచాటు మీటింగులు పెడుతున్నావు. నువ్వు నిజమైన బీఆర్ఎస్ నాయకుడివి అయితే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు. నువ్వు నేను చూసుకుందాం. పార్టీ నుండి బహిష్కరించిన వారు మాత్రమే నీతో ఉంటున్నారు. పార్టీపై అసంతృప్తులుగా ఉన్న వాళ్లే నీ వెంట ఉంటున్నారు. ఈరోజు నుండి ఎన్నికలు జరిగే వరకు ప్రతిరోజు తిరుగుతాను. ప్రతి ఊరిలోనూ డప్పు కొడుతాను. ఓటర్లకు పైసలు ఇచ్చి గెలిచే రోజులు పోయాయి. నియోజకవర్గంలో నాలా పరుగెత్తాలంటే నీ గుండె ఆగిపోతుంది. ప్రతిపక్షాల పప్పులు ఉడకకుండా చేసిన మొండి కేసీఆర్ అయితే.. అంతకు మించిన జగమొండిని నేను. అభివృద్ధి కార్యక్రమాలలో ఏ రోజు కూడా కొబ్బరికాయ కొట్టని నేతలు కూడా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. 20 సంవత్సరాలుగా నియోజకవర్గానికి, ప్రజలకు దూరమై.. వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటున్నావు’’ అంటూ కడియంపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కామెంట్స్ చేశారు. ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు తిట్టుకుంటుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.