భద్రాచలం, వెలుగు : వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా నిలిచిందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండల కేంద్రంలో బుధవారం ఆయన సబ్సిడీపై వచ్చిన యంత్రాలు రోటవేటర్లు, పవర్ టిల్లర్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లలో రైతులకు రాయితీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కారు అన్నదాతల కష్టాలను చూసి వారికి వెన్నుదన్నుగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ ఇందల బుచ్చిబాబు, తహసీల్దారు శ్రీనివాస్, ఎంపీడీవో ఈదయ్య, ఏవో లావణ్య తదితరులు పాల్గొన్నారు.
