
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం,వెలుగు: దుమ్ముగూడెం మండలంలోని చినబండిరేవు పీహెచ్సీని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం తనిఖీ చేశారు. రోగులు, వైద్యులతో ఆయన మాట్లాడారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు వానాకాలంలో రోగులకు మెరుగైన వైద్యం అందించేలా ప్లాన్ చేసుకోవాలని, సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని వైద్యులకు సూచించారు. అనంతరం చర్ల మండలంలో పర్యటించి కలివేరులో మిషన్భగీరథ వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ గ్రామంలో ఇటీవల విద్యుత్షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయిన బాధితుడు కల్లూరి సమ్మయ్యను పరామర్శించారు. ఆర్ధిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఉదయం ఎమ్మెల్యే భద్రాచలం పట్టణంలోని అయ్యప్పకాలనీలో పర్యటించారు. ముంపు ప్రాంతం నుంచి డబుల్ బెడ్రూంలకు అక్కడి ప్రజలను తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానికులు చెప్పిన ఇబ్బందులను విన్నారు.