ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్,  కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం బయటకు వచ్చాక.. మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్,  కేటీఆర్ లు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. నవీన్ రావు, శ్రవణ్ రావులు సర్వేంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారన్నారు.

ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే లైవ్ డీటేక్టర్ కు వస్తారా..? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని ఫైరయ్యారు. శ్రవణ్ రావు, నవీన్ రావులు.. ఫోన్ ట్యాపింగ్ తో వ్యక్తులను బెదిరించి వందల కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు.  ఈ కేసులో సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలన్నారు. ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదాలాయించారని... నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. చెల్లి కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశాడని ఎద్దేవా చేశారాయన.

ALSO READ | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపికి రఘునందన్రావు ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదన్నారు ఎమ్మెల్యే యెన్నం. అన్ని బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదు.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనతోపాటు చాలా మంది భాదితులు ఉన్నారని చెప్పారు.ఈ విషయంపై  నిన్న డీజీపీకి పిర్యాదు చేశానని.. అందరూ పిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతీ జిల్లాలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి.. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. రాష్ట్రంలో వీళ్ల ఆగడాలు తెలిసి కూడా.. కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరించాయని యెన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.