
- ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రకృతితో మమేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో ఆవిష్కరించగల కవి మునాసు వెంకట్ అని ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం నల్గొండలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సృజన సాహితీ ఆధ్వర్యంలో నల్గొండకు చెందిన ప్రముఖ కవి మునాస వెంకట్ రాసిన ‘దాపు కవిత సంపుటి’ని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాల్లో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాస వెంకట్ ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రముఖ విమర్శకులు అంబటి సురేంద్ర రాజు, గుంటూరు లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవితాలతో అంతర్జాతీయ స్థాయి కవిత్వం రాసిన వారు మునాసు వెంకట్ అని కొనియాడారు. తనదైన శైలిలో కవిత్వం రాసిన వెంకట్ తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం అజరామరం అని అన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ బెల్లి యాదయ్య, కవి, గాయక సిద్ధార్థ, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య భాను, కొత్వాల్, పెరుమాళ్ల ఆనంద్, అంబటి వెంకన్న, తుల శ్రీనివాస్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, శీలం భద్రయ్య, బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, సాగర్ల సత్తయ్య, కస్తూరి ప్రభాకర్, మాదగాని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.