ITIRపై ప్రభుత్వం ఉద్యమిస్తే మేం మద్దతిస్తాం

ITIRపై ప్రభుత్వం ఉద్యమిస్తే మేం మద్దతిస్తాం

హైదరాబాద్: ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించాలని, ఈ ఉద్యమానికి తాము మద్దతునిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ, షుగర్ ఫ్యాక్టరీ, విభజన హామీలపై మండలిలో జీవన్ రెడ్డి మాట్లాడారు. రైతులు పంటల బీమా కడుతున్నారని.. కానీ కేంద్ర, రాష్ట్ర  ప్ర భుత్వాలు కట్టడం లేదన్నారు. రూ.25 వేల కంటే తక్కువ రుణం ఉన్న వారికే రుణమాఫీ చేశారని.. మిగతా వారికి చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉన్న రాయితీలనే ఇప్పుడు కొనసాగించాలని చెప్పారు. 

‘వరి ధాన్య సేకరణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి. షుగర్ ఫ్యాక్టరీని టీఆర్ఎస్ సర్కార్ మూసివేసింది. ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి. ఉద్యోగ నియామకాల విషయంలో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఎన్ని ఉద్యోగాలు నింపారో చెప్పలేదు. పర్మినెంట్ కావడం లేదని ఇద్దరు ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దుబ్బాక ఎలక్షన్ ముందు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు కావాలని  ఉద్యమం చేయాలె. మీతో పాటు మేం కూడా ఉద్యమంలో పాల్గొంటాం. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 30 నెలల నుంచి ఇప్పటివరకు పీఆర్సీ ఇవ్వలేదు. ఐఆర్ కూడా ఇవ్వలేదు. పాలన ప్రగతి భవన్ నుంచి బయటికి వస్తేనే బాగుపడుతుంది’ అని జీవన్ రెడ్డి అన్నారు.