
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మాజీ డిప్యూటీ సీఎంలు కడియం వర్సెస్ రాజయ్యగా పొలిటికల్ హీట్ పెరుగుతున్నది. మార్చి 20న కడియం శ్రీహరి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
"నేను ఎలాంటి తప్పు చేయను.. ఎవరికి క్షమాపణ చెప్పను. నియోజకవర్గంలోని రిజర్వాయర్లు తామే తెచ్చామని చెప్పుకునే వాళ్లకు రిజర్వాయర్లు ఎక్కడుంటాయో తెలుసా..రిజర్వాయర్ల కెపాసిటీ ఎంతుంటుందో, వాటి కింద ఉండే ఆయకట్టు ఎంతో కూడా తెలియదు. కానీ అభివృద్ధి తామే చేసామని చెప్పుకుంటున్నారు. చేయాలని ఆలోచన, చేసే తపన ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏదైనా అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి. దానికంటే ముందు మనకు అడిగే పద్ధతి... చెప్పే పద్ధతి తెలియాలి" అని కడియం పేర్కొన్నారు.
ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య ఓ మహిళా సర్పంచ్ కి క్షమాపణ చెప్పిన తీరును కడియం శ్రీహరి పరోక్షంగా ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజయ్య వర్గీయులు. కడియం శ్రీహరి తాజా వ్యాఖ్యలతో మరోసారి రచ్చకెక్కాయి బీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలు.