లిక్కర్​ స్కామ్..డైలీ సీరియల్ : ఎమ్మెల్సీ కవిత

లిక్కర్​ స్కామ్..డైలీ సీరియల్ : ఎమ్మెల్సీ కవిత

ఎన్నికల దాకా నడుస్తనే ఉంటది..  
లిక్కర్​ స్కామ్​పై కవిత కామెంట్​
ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో భేటీ
చార్జ్​షీట్​పై న్యాయ నిపుణులతో చర్చలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్​లో ఈడీ దాఖలు చేసిన చార్జ్​షీట్‌‌‌‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్​లో ఆమె తన తండ్రి, సీఎం కేసీఆర్​తో భేటీ అయ్యారు. బంజారాహిల్స్​లోని తన ఇంటి నుంచి ప్రగతి భవన్‌‌‌‌కు బయల్దేరే ముందు అక్కడ ఉన్న మీడియాతో కవిత కాసేపు మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్​ డైలీ సీరియల్‌‌‌‌ లాంటిదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఇది నడుస్తూనే ఉంటుందని అన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని తెలిపారు. 

గంటకుపైగా కేసీఆర్​, న్యాయనిపుణులతో చర్చలు 

సీఎం కేసీఆర్‌‌‌‌తో  కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌‌‌‌కు వెళ్లిన ఆమె.. గంటకు పైగా కేసీఆర్‌‌‌‌తో చర్చించినట్లు తెలిసింది. వీరి భేటీలో న్యాయ నిపుణులు కూడా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్​ నిందితుడు సమీర్‌‌‌‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్​షీట్‌‌‌‌లో కవిత పేరును ప్రస్తావించడం.. మున్ముందు ఈడీ, సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వాటిని ఎలా ఎదుర్కోవాలని న్యాయ నిపుణులతో కేసీఆర్‌‌‌‌ ఆరా తీసినట్టు తెలిసింది. చార్జ్​షీట్‌‌‌‌లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా..? గతంలో సీబీఐ విచారణ సందర్భంగా కవిత నుంచి సేకరించిన వివరాలను చార్జ్​షీట్​లో ఏమైనా చేర్చారా అని అడిగినట్టు సమాచారం. తర్వాత ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌‌‌‌ విందుకు కేసీఆర్​ వెళ్లారు. అమిత్​ అరోరా రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ఈ నెల 11 వ తేదీన ఆమె నివాసంలో ప్రశ్నించారు.