- కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఎమ్మెల్సీ కొమరయ్య వినతి
హైదరాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు, గ్రామీణ గిరిజన యువతకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
తన నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో ‘ఖేలో ఇండియా’ స్కీమ్ కింద రూ.51.50 కోట్లతో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశారు. గిరిజన ప్రాంతాల్లో హాకీ వంటి క్రీడలకు అవసరమైన సింథటిక్ టర్ఫ్, శిక్షణా సౌకర్యాల ప్రాధాన్యతను ఆయన మంత్రికి వివరించారు. కొమరయ్య వినతులపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సానుకూలంగా స్పందించారు.
