చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కరుణామయ’. ఆరాధ్య హైందవి సమర్ఫణలో సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. బుధవారం రామానాయుడు స్టూడియోస్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ల మాట్లాడుతూ ‘తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎమోషన్స్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం.
ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం’ అని చెప్పాడు. కేవలం ఒక మతానికే సంబంధించిన వారికే కాకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని హీరోహీరోయిన్స్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 23న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు చెప్పారు.
