
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లకు పీవీ నర్సింహారావు గుర్తుకు వచ్చారా అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రశ్నించారు. శనివారం ఆమె మేయర్ గద్వాల విజయలక్ష్మీతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. చివరి శ్వాస వరకు పీవీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారని గుర్తుచేశారు. మరణాంతరం ఆయనపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపించాయని, కాంగ్రెస్ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ మాత్రమే పీవీకి న్యాయం చేశారన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికి పీవీ ఘనత తెలియజెప్పేలా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారని ప్రశసించారు. కేసీఆర్ ఉద్యమంతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు. ఎన్నికల టైం కాబట్టి ఎవరెవరో వచ్చి ఏవేవో మాట్లాడితే నమ్మొద్దని సూచించారు. పీవీపై కడుపులో విషం పెట్టుకొని పైకి మాత్రం ప్రియాంక గాంధీ తియ్యగా మాట్లాడుతున్నారని మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. పీవీ చనిపోయిన రోజు ఆయన భౌతిక కాయం కూడా కాంగ్రెస్ ఆఫీస్లోకి తీసుకురానివ్వలేదని తెలిపారు.