టీఆర్ఎస్ లీడర్లకు ‘ఎమ్మెల్సీ’ టార్గెట్లు

టీఆర్ఎస్ లీడర్లకు ‘ఎమ్మెల్సీ’ టార్గెట్లు

ఎలాగైనా గెలిచితీరాలని హైకమాండ్​ఆదేశాలు

రంగంలోకి ఎమ్మెల్యేలు, మంత్రులు

నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు

గల్లీగల్లీనా గ్రాడ్యుయేట్ల లిస్ట్ ప్రిపరేషన్

వరంగల్‍ రూరల్, వెలుగు: తమకు అచ్చిరాని గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో ఈసారి ఎలాగైనా గెలిచితీరాలని భావిస్తున్న టీఆర్ఎస్​హైకమాండ్, ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్​ పెట్టింది. ఇప్పుడిప్పుడే  కరోనా ఫీవర్‍ నుంచి  బయటపడుతున్న లీడర్లకు ‘ఏం చేస్తారో తెలియదు.. గెలిచి తీరాల్సిందే’ అన్న రీతిలో హుకుం జారీ చేసింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలు, రాష్ట్ర సర్కారు తీరుపట్ల యూత్, నిరుద్యోగులు ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారనే  ఇంటెలిజెన్స్ రిపోర్టే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఐదారు నెలల ముందుగానే  రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. గల్లీగల్లీనా గ్రాడ్యుయేట్​ఓటర్​నమోదు, లిస్ట్  ప్రిపరేషన్​ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

ఎమ్మెల్యేల ఉరుకులు, పరుగులు

వచ్చే ఏడాది ప్రారంభంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంతో పాటు  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, కాంట్రాక్ట్​ ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన లేకపోవడం, ఇతర డిమాండ్లు పరిష్కారానికి నోచుకోకపోవడంతో​ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు గ్రాడ్యుయేట్​ స్థానాలను గెలుచుకోవడం టీఆర్ఎస్‍ పార్టీకి పెద్ద సవాల్​గా మారింది. ఇందుకోసం ఆరు నెలల ముందుగానే  పార్టీ హైకమాండ్​ఎమ్మెల్యేలకు టార్గెట్‍ పెట్టింది. మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పింది. వీరిమీద మళ్లీ  ఇన్​చార్జీలను నియమించింది. కాగా, ఎమ్మెల్యేలంతా రెండు వారాల ముందే ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లో వరుసగా ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. యాక్టివ్‍గా ఉండే యూత్‍ను  ఐడెంటిఫై చేసి గ్రాడ్యుయేట్ ఓట్లపై గురి పెడుతున్నారు.  తమ  కార్యకర్తల సాయంతో గల్లీగల్లీలో గ్రాడ్యుయేటర్ల  లిస్ట్ ప్రిపేర్ చేపిస్తున్నారు. ఎలిజిబులిటీ ఉన్న గ్రాడ్యేయేట్​లకు ఓటు హక్కు పొందేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖర్చునూ లెక్కచేయట్లే

రాబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోని రిజల్ట్స్ కారు పార్టీకి ప్రిస్టేజ్ ఇష్యూ కావడంతో పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు ఖర్చుకు వెనకాడట్లేదు. నియోజకవర్గాలు, మండల హెడ్‍ క్వార్టర్స్ లోని  పెద్దపెద్ద ఫంక్షన్‍ హాళ్లలో వందలాది కార్యకర్తలు, యువజన సంఘాలతో మీటింగులు పెడుతున్నారు. మంత్రులు, ఎన్నికల ఇన్​చార్జులను అతిథులుగా పిలిచి స్పీచ్‍లు ఇప్పిస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి వచ్చేవారందరికి టీ, స్నాక్స్, లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇలాంటి జిమ్మిక్కులకు సామాన్యులైతే ఏమో గానీ గ్రాడ్యుయేట్లు  పడిపోయే చాన్సే లేదని, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్న  విద్యావంతులంతా తమవైపే నిలుస్తారని ప్రతిపక్ష నేతలు భరోసాతో ఉన్నారు.

టీఆర్ఎస్​ను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్​

రాష్ట్రంలో 2015లో జరిగిన రెండు గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీఆర్ఎస్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్‍ నుంచి అధికార పార్టీ క్యాండిడేట్, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‍ మీద బీజేపీ లీడర్ రామచందర్రావు విజయం సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. తమకు ఎదురే లేదనుకునే క్రమంలో ఇలాంటి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ పెద్దలు కంగుతిన్నారు. అనంతరం జరిగిన కరీంనగర్‍ గ్రాడ్యుయేట్స్​ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్‍ గౌడ్‍పై కాంగ్రెస్‍ పార్టీకి  చెందిన జీవన్‍రెడ్డి విజయం సాధించారు. అనంతరం నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్‍ బలపరిచిన అభ్యర్థి పూల రవీందర్ ఓటమి చెందగా.. అపోజిషన్‍ పర్సన్ నర్సిరెడ్డి  గెలిచారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే టీఆర్ఎస్ పార్టీకి  ఫెయిల్యూర్‍ రిజల్ట్స్ కళ్లముందు మెదులుతున్నాయి.

For More News..

కరోనా పేషెంట్​కు ఇంట్లోనే డెలివరీ

రూ. 4 వేల కోట్లతో సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో.. 9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్

అధిక వడ్డీలు ఆఫర్ చేస్తున్న చిన్న బ్యాంకులు