వ్యాక్సిన్ కోసం ఇతర దేశాల ప్రధానులు చేయని ప్రయత్నం ప్రధాని మోడీ చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాస్త్రవేతలకు మనోధైర్యాన్ని ఇవ్వటానికి ప్రధాని మోడీ హైదరాబాద్లో పర్యటించారన్నారు. వ్యాక్సిన్ కోసం కృషి చేస్తునే.. ఇతర దేశాలతో మోడీ సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ సనత్ నగర్ లోని ESI ఆస్పత్రిలో కొవిడ్ సేఫ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ తర్వాత మాట్లాడిన ఆయన… ప్రత్యేక టాక్స్ఫోర్స్ను ఏర్పాటు చేసి పీఎంవోలో ప్రతి రోజు ప్రధాని మోడీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారతదేశమే వ్యాక్సిన్ అందించాలని కేంద్రం పట్టుదలగా ఉందన్నారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీ కోసం చైన్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. ESI ఆస్పత్రిలో నూతన వైద్యపరికరాలను తీసుకొచ్చామని… కార్మికుల కోసం అధునాతన వసతులను ఏర్పాటు చేశామన్నారు. సనత్నగర్ ఈఎస్ఐ 80లక్షల మంది కార్మికులకు సేవలందిస్తోందన్నారు. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్కు ESI మెడికల్ కాలేజీ ఉపయోగకరంగా ఉందని తెలిపారు. 2019 ఏడాదికి గాను దేశంలోనే ఉత్తమ మెడికల్ కాలేజీ, ఉత్తమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ESIకు అవార్డులు రావటం సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.