దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. విద్వేషాన్ని పెంచి పోషించే ఆగడాలు జరుగుతుంటే ప్రధాని మౌనం వహించడం బాధాకరమన్నారు. హైదరాబాద్ లో రేపు జరగనున్న బీజేపీ బహిరంగ సభలోనైనా ఆ అంశాల గురించి ప్రధాని మాట్లాడుతారో..లేదో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో శనివారం (జూలై 2న) జరిగిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. మోడీ ప్రతినెలా మన్ కీ బాత్ చెబుతారు. కానీ ఒక్కసారి కూడా ప్రజల మన్ కీ బాత్ వినరని ఎద్దేవా చేశారు. గత 8 ఏళ్ల పాలనలో మోడీ ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేదన్నారు. ‘‘నేను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఈడీ నా శాఖ పరిధిలోనే ఉండేది. కానీ అప్పట్లో నాకు ఈడీని దుర్వినియోగం చేయాలనే దురాలోచన రానే రాలేదు. విపక్షాలపైకి ఈడీ ఉసిగొల్పాలనే పన్నాగాలు కూడా పన్నలేదు”అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. విపక్షాల నాయకులను అవమానించడమే లక్షంగా ఎన్డీయే సర్కారు ముందుకు సాగుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
ఈసారి అసాధారణ పరిస్థితుల నడుమ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీకాదు..రెండు సిద్ధాంతపరమైన వైరుధ్యాల మధ్య జరుగుతున్న పోటీ. టీఆర్ఎస్ లాంటి పార్టీల సహకారంతో నేను ఈ పోటీలో నిలబడుతున్నాను. ఇటువంటి ప్రత్యేక సందర్భంలో ప్రత్యర్ధి దగ్గర ఎలాంటి అస్త్రశస్త్రాలున్నాయి..? వాళ్ల బలం, బలగం ఏమిటనేది పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మన దగ్గరున్నన్ని వనరులతోనే శత్రువుపై పోరాటం చేయాల్సి ఉంటుంది ’’ అని ఆయన కామెంట్స్ చేశారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే..రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కర్తవ్యంగా ముందుకుపోతా. ఒకవేళ ఓడిపోతే రానున్న రోజుల్లో ఎన్డీయే కూటమిపై జరుగుతున్న పోరాటంలో భాగమవుతా” అని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ లాంటి నాయకులు కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి యావత్ దేశంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతిపదం వాస్తవమన్నారు. దేశంలో పీపుల్స్ మూమెంట్ మొదలైందన్నారు. టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఢిల్లీలో తన నామినేషన్ కార్యక్రమం సందర్భంగా సంఘీభావం తెలపడం మరింత నైతిక బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్ లో కొట్లాడారని యశ్వంత్ సిన్హా కామెంట్ చేశారు.