- వాళ్ల దగ్గర పిండి, కరెంట్.. ఆఖరికి గాజులు కూడా లేవని తెలిసింది : ప్రధాని మోదీ
- అణుబాంబులున్నాయని కూటమి నేతలు భయపడుతున్నారు
- అలాంటి పిరికిపందలకు దేశాన్ని అప్పగిద్దామా?
- బిహార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగం
పాకిస్తాన్ వద్ద వేసుకొనేందుకు గాజులే లేకుంటే తాము గాజులు కొని పంపిస్తామని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పాక్వద్ద అణుబాంబులున్నాయని ఇండియా కూటమి నాయకులు భయపడుతున్నారని అన్నారు.
పాట్నా: పాకిస్తాన్వద్ద వేసుకునేందుకు గాజులు లేకుంటే తాము గాజులు కొని తొడిగిస్తామని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పాక్ వద్ద అణుబాంబులున్నాయని ఇండియా కూటమి నాయకులు భయపడుతున్నారని అన్నారు. వారు పిరికిపందలని, అలాంటి కూటమికి దేశాన్ని అప్పజెప్పుదామా? అని ప్రశ్నించారు. బిహార్లోని హజీపూర్, ముజఫర్పూర్, సరన్ నియోజకవర్గాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్ గాజులేమీ వేసుకోలేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఇటీవల కామెంట్ చేశారు. దీనికి మోదీ కౌంటర్ ఇచ్చారు. ‘పాకిస్తాన్లో గోధుమ పిండి లేదు. కరెంట్ లేదు. గాజులు కూడా లేవని ఇప్పుడే నాకు తెలిసింది. అయితే, వారికి మనం గాజులు తొడిగిద్దాం’ అని ఫరూక్ అబ్దుల్లాతోపాటు ఇండియా కూటమికి పరోక్షంగా చురకలంటించారు.
ఇండియా కూటమి గెలిస్తే ఏడాదికో పీఎం
ఇండియా కూటమి కొత్త ఫార్ములా రూపొందించిందని, ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే తమ ఐదుగురి నాయకులకు ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి పీఎం పదవిని పంచాలని నిర్ణయించిందని మోదీ అన్నారు. ఇవి దేశ ఆర్థిక స్థితిని మరింత ముందుకు తీసుకుపోయే ఎన్నికలని, ఆలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు. ‘ఈడీ దాడులపై ఇండియా కూటమి ఎందుకు అరుస్తుందో నేను మీకు చెప్తాను.
కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం రూ. 35 లక్షలు సీజ్చేసింది. దీన్ని ఓ స్కూల్ బ్యాగులో తీసుకెళ్లొచ్చు. కానీ, బీజేపీ పాలనలో ఇప్పటివరకూ రూ. 2,200 కోట్ల అక్రమ సంపదను సీజ్ చేసింది. దీన్ని తరలించాలంటే 70 చిన్న ట్రక్కులు అవసరం’ అని తెలిపారు. ప్రతిపక్ష నాయకులలాగా తనకు వారసులెవరూ లేరని, ప్రజలే తన వారసులని అన్నారు.
మతపర రిజర్వేషన్లను అంగీకరించను
కాంగ్రెస్, ఆర్జేడీలాంటి పార్టీలు బుజ్జగింపు రాజకీయాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాయని మోదీ పునరుద్ఘాటించారు. అయితే, తన కంఠంలో ప్రాణముండగా దీనికి అంగీకరించబోనని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కాంగ్రెస్కు తాను సవాల్ విసిరితే.. ఇప్పటికీ స్పందించలేదని మోదీ అన్నారు.
తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్లో..
బిహార్ పర్యటనలో భాగంగా తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ను ప్రధాని మోదీ సందర్శించారు. తలకు టర్బన్ చుట్టుకొని దర్బార్ సాహిబ్లో ప్రార్థనలు చేశారు. గురుద్వారాలో భక్తులకు లంగర్ (ఆహారాన్ని) వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ.. సిక్కు గురువుల బోధనలు మనందరికీ స్ఫూర్తినిస్తాయని, మార్గనిర్దేశం చేస్తాయని మోదీ అన్నారు.
వారణాసిలో మోదీ భారీ రోడ్షో
ప్రధాని మోదీ తాను పోటీచేస్తున్న యూపీలోని వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు. సంత్ రవిదాస్ గేట్, అస్సీ, సోనార్పుర, జంగంబడి, గొధూలియా మీదుగా కాశీ విశ్వనాథ్ ధామ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కాశీ టెంపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు.