-
1991 నుంచి ఏడుసార్లు ఎగిరిన కాషాయ జెండా
-
రెండు దశాబ్దాల్లో 2004లో మాత్రమే కాంగ్రెస్కు పట్టం
-
2014 నుంచి మోదీ కంచుకోటగా పవిత్ర నగరం
-
మూడోసారీ ఇక్కడి నుంచే పోటీ
లక్నో: పవిత్ర నగరం వారణాసి బీజేపీకి కంచుకోటగా మారింది. 2004లో మినహా 1991 నుంచి ఇక్కడ వరుసగా కాషాయ జెండానే ఎగురుతున్నది. 2004లో మాత్రం ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కు పట్టం గట్టారు. 2013లో ఢిల్లీలో ఆప్ సర్కారు కొలువు దీరిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో మోదీపై పోటీచేశారు. ఈ పోరులో మోదీ 3 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో కేజ్రీవాల్పై ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్కూడా రెండు లక్షల ఓట్లు సాధించగలిగారు. ఇక్కడ గెలుపుతో మోదీ ప్రధానమంత్రి పీఠం అధిరోహించగా, వారణాసి ప్రొఫైల్ మరింత పెరిగింది. అప్పటినుంచి ఈ సిటీ రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏడుసార్లు బీజేపీ.. ఆరు సార్లు కాంగ్రెస్
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం ఐదు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. 1957 నుంచి ఇక్కడ బీజేపీ ఏడుసార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు గెలిచింది. 2004 మినహా 1991 నుంచి బీజేపీ వరుస విజయాలను నమోదు చేస్తూ వారణాసిని కాషాయ పార్టీ తన అడ్డాగా మార్చేసుకున్నది. ఇక్కడినుంచి గెలిచిన ఇద్దరు నాయకులకు దేశ ప్రధానిగా అవకాశం దక్కింది. 1977 ఎన్నికల్లో వారణాసిలో 47.9% ఓట్ల మెజార్టీతో గెలిచిన చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు. అనంతరం 2014లో ఇక్కడి నుంచి గెలిచిన నరేంద్ర మోదీకి ప్రధాని అయ్యే గోల్డెన్ చాన్స్ దక్కింది. అలాగే, యూపీలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు ఇంతవరకూ గెలవని 11 నియోజకవర్గాల్లో వారణాసి కూడా ఒకటి కావడం గమనార్హం.
2014లో మోదీ పోటీకి బలమైన కారణం
మోదీకంటే ముందు ఈ నియోజకవర్గ సీటు సీనియర్ నేత మురళీమనోహర్ జోషిది. అయితే, 2014లో కాంగ్రెస్ను నిలువరించి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 80 లోక్సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్లో మెజారిటీ సీట్లను గెల్చుకోవాల్సిన పరిస్థితి.. దీంతో ఇక్కడ పట్టుసాధిస్తే సరిహద్దుల్లోని 40 ఎంపీ స్థానాలున్న బిహార్లోనూ కలిసొస్తుందనే బలమైన విశ్వాసంతో బీజేపీ.. హిందూ ఓటుబ్యాంకు అధికంగా ఉన్న వారణాసి నుంచి మోదీని రంగంలోకి దింపింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇక్కడినుంచే బరిలో నిలిచి, సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్పై 4.7 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించారు. రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు.
2024 ఎన్నికల్లోనూ మోదీ ఇక్కడినుంచే పోటీ!
మోదీ ముచ్చటగా మూడోసారి కూడా ఇక్కడి నుంచే బరిలో నిలుస్తున్నారని తెలుస్తున్నది. ఈ విషయంపై బీజేపీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్నుంచి వరుసగా మూడోసారి అజయ్రాయ్ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో అజయ్ రాయ్ మూడోస్థానంలో నిలిచారు.
75% మంది హిందువులే
వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో 19.62 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 10.65 లక్షల మంది పురుషులు కాగా, 8.97లక్షల మంది మహిళలు. 135 మంది ఇతరులు ఉన్నారు. కాగా, ఈ నియోజకవర్గ జనాభాలో 75% మంది హిందువులే. 20% మంది ముస్లింలు, 5% మంది ఇతర మతస్థులు ఉన్నారు.ఈ నియోజకవర్గంలో హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బీజేపీకి ఓట్లశాతం పెరుగుతూ వస్తున్నది.