
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ లో చోటు సంపాదిస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. షమీని ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టిన సెలక్టర్లు ఇకపై వన్డేల్లోనూ చెక్ పెట్టబోతున్నట్టు సమాచారం. వాస్తవానికి షమీ టీ20తో పాటు వన్డే ప్రణాళికల్లో లేడు. ఆస్ట్రేలియా టూర్ లో షమీ అనుభవం పనికివచ్చినా అతని ఫిట్ నెస్, ఫామ్ ను నమ్ముకునే స్థితిలో టీమ్ మేనేజ్ మెంట్ లేనట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 28న ఆసియా కప్ ముగుస్తుంది. ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వైట్ బాల్ టూర్ ఉంటుంది. ప్రస్తుతం ఇండియాకు షమీ ఆవసరం లేదు. జస్ప్రీత్ నుంరాతో పాటు మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా టూర్ కు సెలక్ట్ అవ్వడం ఖాయం. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా బ్యాకప్ పేసర్లుగా జట్టులో ఉంటారు. దీంతో ఫామ్ లో లేని షమీని తీసుకొని వచ్చి ఆడించే సాహసం టీమిండియా సెలక్టర్లు చేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్ గా షమీ కెరీర్ వైట్ బాల్ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది. త్వరగా ఫామ్ లోకి రాకపోతే టెస్ట్ జట్టులోనూ చోటు దక్కించుకోవడం కష్టమే.