మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ అవడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసులో ఏ7గా ఉన్న శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా ఇవాళ వాదనలు వినిపించారు. రహస్యంగా ఉంచాలనుకున్న సిట్ నివేదిక ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. అయితే సిట్ కౌంటర్ కాపీలను పిటిషనర్లు, వారి తరపు న్యాయవాదులకు అందించామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఫిర్యాదుదారుడైన MLA రోహిత్ రెడ్డికి కూడా ఓ కాపీ ఇచ్చామని.... ఆయన నుంచి సీఎంకు చేరి ఉండొచ్చని కోర్టుకు తెలిపారు.
మెజిస్ట్రేట్ ముందుకి ఎఫ్ఐఆర్ చేరక ముందే పోలీసులు మీడియా బ్రీఫ్ చేశారని శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా తెలిపారు. దర్యాప్తు మొత్తం కేవలం మీడియా కోసమే చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో పిసి యాక్ట్ సెక్షన్ 8 వర్తిస్తుందా అని హైకోర్ట్ ప్రశ్నించగా.. అసలు డబ్బు దొరకనప్పుడు సెక్షన్ 8 ఎలా వర్తిస్తుందని నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది ఉదయ్ ఉల్లా వాదించారు. కేవలం పొలిటికల్ గేమ్ కోసమే ఈ కేసు పెట్టారని.. అందుకే ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.