పెండ్లి పేరుతో మహిళలను మోసగించిన.. పాత నేరస్తుడు అరెస్ట్

పెండ్లి పేరుతో మహిళలను మోసగించిన.. పాత నేరస్తుడు అరెస్ట్

సికింద్రాబాద్​, వెలుగు:  పెళ్లి పేరుతో మహిళలను నమ్మించి అందిన కాడికి దోచుకుని ఉడాయించే  పాత నేరస్తుడిని మోండా మార్కెట్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 27 తులాల బంగారు ఆభరణాలు, సెల్​ఫోన్​, బ్యాంకు పాస్​బుక్​, క్రెడిట్​కార్డును స్వాధీనం చేసుకుని రిమాండ్​ కు పంపారు. గురువారం ​మహంకాళి ఏసీపీ రవీందర్ ​మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన తుమ్మ మోహన్​రెడ్డి అలియాస్​శ్రీనాథ్​(38) పాత నేరస్తుడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 2011లో  మోహన్​రెడ్డి సొంతూరికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని కల్వకుర్తికి వెళ్లాడు. 

ఓ ప్రైవేటు స్కూల్​లో  టీచర్​గా పని చేస్తూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో అరెస్టై జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక డబ్బులు ఈజీగా సంపాదించాలనే దురాశతో పెళ్లి పేరుతో మహిళలను మోసగించేందుకు పాన్ల్​వేశాడు. ముందుగా కందుకూరులో మోహన్​రెడ్డి బంధువు కారును దొంగిలించి రూ.4.5లక్షలకు అమ్మేశాడు.  సిటీకి వచ్చి వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ.. రూమ్​మేట్స్​కు చెందిన ఎలక్ర్టానిక్ ​వస్తువులు దొంగిలించి అమ్మకునేవాడు. అనంతరం బెంగళూరు వెళ్లి షాదీ డాట్​కామ్​వెబ్​సైట్​లో  వివరాలు నమోదు చేశాడు. ఓ మహిళతో  ఫ్రెండ్ షిప్ చేసి  నమ్మించి క్రెడిట్​కార్డు తీసుకుని   రూ.2.2లక్షలతో బంగారు ఆభరణాలు కొని విజయవాడకు పారిపోయి అమ్మాడు. 

అక్కడ గౌతమ్​రెడ్డిపేరుతో ఒక ఫేక్​ ఐడీ సృష్టించి షాదీ డాట్​కామ్​వెబ్​సైట్​లో  పెళ్లి కోసం వివరాలు  పెట్టాడు. మియాపూర్​కు చెందిన ఓ యువతితో చాటింగ్​చేయగా, హైదరాబాద్​కు వచ్చి రెండుసార్లు కలిశాడు.  నమ్మించి ఆమె వద్ద క్రెడిట్​కార్డును తీసుకుని  రూ.6,21,483ల విలువైన బంగారు నగలు కొన్నాడు. తిరిగి విజయవాడకు వెళ్లి నగలను అమ్మాడు. 2023లో రెడ్డి మ్యాట్రిమోనీ డాట్​కామ్​వెబ్​సైట్ లో తిరుమల విజయ్​రెడ్డి పేరుతో  ఫేక్​ ఐడీ క్రియేట్ చేసి  గుంటూరుకు చెందిన ఓ అమ్మాయి నుంచి రూ.9లక్షలు కాజేశాడు. ఆ తర్వాత భారత్​మ్యాట్రిమోనీ డాట్​కామ్​లో ఒక ఫేక్​ఐడీ సృష్టించి  శ్రీనాథ్​ పేరుతో వివరాలు పోస్ట్​ చేశాడు. 

ఓ అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపింది. దీంతో మోహన్​రెడ్డి ఈనెల18న సికింద్రాబాద్​లోని ఓ లాడ్జికి ఆమెను పిలిచాడు. ఆమె వాష్​ రూమ్​కు వెళ్లిన టైమ్​లో మోహన్​రెడ్డి ఆమె బ్యాగులోని 27 తులాల బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు మార్కెట్ ​పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి మోహన్​రెడ్డిని అరెస్ట్ చేశారు.