
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్లో జరుగుతున్న మాన్సూన్ రెగట్టాలో తెలంగాణ సెయిలర్లు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో పలు విభాగాల్లో అద్భుతంగా రాణించి పతకాల దిశగా దూసుకెళ్తున్నారు. రసూల్పురాకు చెందిన బన్నేవోలు రవి కుమార్ అండర్–15 ఆప్టిమిస్ట్ ఫ్లీట్లో భాగంలో జరిగిన రేసులో అద్భుతంగా పుంజుకొని విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నగరంలోని తారా హోమ్కు చెందిన నవీన్. ఎం రెండో స్థానంలో నిలిచాడు. అండర్-–19 మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ జంటలు తనుజ–-శ్రావణ్ తొలి స్థానంలో, దీక్షిత-–గణేష్ రెండో స్థానంలో నిలిచి స్వర్ణ, రజత పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. సబ్ -జూనియర్స్ బాలుర విభాగంలో రిజ్వాన్ మొహమ్మద్ అగ్రస్థానంలో దూసుకెళ్తుండగా, రవి నాయక్ పల్త్యా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బాలికల విభాగంలో లాహిరి కొమరవెల్లి రెండో స్థానంలో, చంద్రలేఖ తర్తారి మూడో స్థానంలో నిలిచి పతకాల రేసులో ఉన్నారు.