న్యూయార్క్: హెచ్1 బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలనుకునే హెచ్4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘పబ్లిక్’ సెట్టింగ్లో ఉంచాలని అమెరికా కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 15 నుంచి దరఖాస్తుదారుల అందరి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పరిశీలించనుంది.
ఇప్పటికే స్టూడెంట్స్, ఎక్స్చేంజ్ విజిటర్లకు ఈ నిబంధన అమలులో ఉండగా.. ఇప్పుడు దాన్ని హెచ్1బీ, హెచ్4 కేటగిరీలకు వర్తింపజేయనున్నారు. ‘‘స్క్రీనింగ్ను ఈజీ చేయడం కోసమే హెచ్1 బీ, హెచ్4, ఎఫ్, ఎమ్, జే వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ను ‘పబ్లిక్’గా మార్చాలి’’ అని ఆదేశాల్లో పేర్కొంది.
అమెరికా వీసా అనేది హక్కు కాదని, ప్రత్యేక అనుమతి మాత్రమేనని, జాతీయ భద్రత కోసం అన్ని రకాల సమాచారాన్ని పరిశీలిస్తామని ఆ ఆదేశాల్లో వెల్లడించారు. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఇండియన్ ఐటీ ఎంప్లాయిస్, అక్కడ పనిచేయాలనుకున్న డాక్టర్లపై ప్రభావం చూపనుంది.
ఆ 19 దేశాలపై చర్యలు మొదలు
అమెరికాలో సైనికులపై అఫ్గాన్ వ్యక్తి కాల్పులు జరిపిన నేపథ్యంలో 19 దేశాల పౌరుల గ్రీన్ కార్డ్, పౌరసత్వం, ఇతర ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను ట్రంప్ సర్కారు నిలిపేసింది. ఆ దేశాల జాబితాలో అఫ్గానిస్థాన్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ తదితరాలు ఉన్నాయి. ఆయా దేశాలనుంచి వచ్చి అమెరికాలో గ్రీన్కార్డు పొందిన వారిపైనా మరోసారి సమీక్ష ఉంటుందని అమెరికా తెలిపింది.
