హైదరాబాద్, వెలుగు: కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దని, అందరి ప్రాణాలూ కాపాడుతామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతానికిపైగా బెడ్లు ఖాళీగానే ఉన్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఎక్కడెక్కడ ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నామని చెప్పారు. ఆ వివరాలు చూసుకుని సమీపంలోని హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో బెడ్ల వివరాలు తెలియక దూర ప్రాంతాలకు వెళ్తే ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదముందన్నారు.
మూడు కాల్సెంటర్లు
కరోనా ఇన్ఫర్మేషన్ కోసం మూడు కాల్సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 104, 108 కాల్సెంటర్లు ఇప్పటికే ఉండగా హోం ఐసోలేషన్లో ఉన్నోళ్ల కోసం ప్రత్యేకంగా మరో కాల్సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారు 180059912345 నంబర్కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చన్నారు. వారి కోసం కిట్లు ఇస్తున్నామని, రోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని చెప్పారు. కరోనా పేషెంట్ల కోసం 90 అంబులెన్సులను అందుబాటులో ఉంచామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 60, జిల్లాల్లో 30 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
17 వేల బెడ్లున్నయ్
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో 17,081 బెడ్లు ఖాళీగా ఉన్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఐసోలేషన్ బెడ్లు 11,928, ఆక్సిజన్ బెడ్లు 3,537, ఐసీయూ బెడ్లు 1,616 ఉన్నాయన్నారు. ఐసోలేషన్లో 737 మంది, ఆక్సిజన్పై 733 మంది, ఐసీయూలో 374 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. 90 శాతానికి పైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. సిటీకి నాలుగు దిక్కులా కరోనా ట్రీట్మెంట్ చేసే ఆస్పత్రులున్నాయన్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్, ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్, వరంగల్ హైవేకి దగ్గరల్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ హాస్పిటల్, మమత మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఫ్రీగా కరోనా ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పారు.