హైదరాబాద్ సిటీలో లాక్డౌన్ని పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వెహికిల్స్ను సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ టైమ్లో రోడ్డెక్కే వెహికిల్స్పై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్తో పాటు మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం కేసులు పెడుతున్నారు. గత నెల 12 నుంచి ఇప్పటి వరకు మూడు కమీషనరేట్ల పరిధిలో లక్షకు పైగా వెహికిల్స్ సీజ్ చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో లాక్డౌన్ ఉల్లంఘన కేసులు భారీగా నమోదవుతున్నాయి. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సగటున ప్రతీ రోజు 6వేలకు పైగా లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. వీటిలో దాదాపు 4 వేల వెహికిల్స్ సీజ్ అవుతున్నాయి. సైబరాబాద్, రాచకొండ పరిధిలోనూ వేలల్లో చలాన్లతో పాటు వాహనాలు కూడా సీజ్ అవుతున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి ప్రతీరోజూ 12వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు లక్ష వాహనాలను సీజ్ చేశారు. గతేడాది లాక్డౌన్ మాదిరిగా సీజ్ చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్లలో, మైదానాలలో అలాగే ఉంచడం లేదు. ఈ సారి వాహనాల చలాన్లు కట్టించుకుని తెల్లారే ఇస్తుంటే.. మరికొన్ని వాహనాలను వారంలోపు తిరిగి ఇస్తున్నారు.
రాచకొండ పరిధిలో ఇప్పటివరకు 95వేలకు పైగా లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటిలో 23వేల వెహికిల్స్ సీజ్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా వెహికిల్స్ని పోలీసులు సీజ్ చేశారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్న వెహికిల్స్ కూడా రోడ్డు పైకి వస్తే వారిపై గతంలో ఉన్న ట్రాఫిక్ చలాన్లను కట్టించుకున్న తర్వాతే వాటిని తిరిగి ఇచ్చి పంపారు. వెహికిల్స్ సీజ్ చేస్తేనే జనం అనవసరంగా బయటకి రాకుండా ఉంటారని పోలీసులు అంటున్నారు.
కాగా.. లాక్డౌన్లో వెహికిల్ పదే పదే పట్టుబడితే మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వెహికిల్స్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ బాండ్లు తీసుకొని అప్పగించేవారు. కానీ ఈసారి మాత్రం అలా చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 8లక్షల 79వేల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. ఇందులో అత్యధికంగా మాస్కులు ధరించని వారిపై 4లక్షల 56వేల కేసులు పెట్టినట్టు ఆయన చెప్పారు.