
టీఎస్ పీఎస్ సీ( TSPSC) ఛైర్మెన్, సభ్యుల పోస్టుల కోసం ఆరు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఛైర్మన్ తో పాటు మెంబర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఆశావాహులు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు సర్వీస్ లో ఉన్నోళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్స్ దరఖాస్తు చేశారు. స్ర్కూటీని తర్వాత ఫైనల్ లిస్ట్ ను ప్రభుత్వానికి అందజేయనున్నారు జీఏడి అధికారులు.
జనవరి 18తో దరఖాస్తులకు గడువు ముగిసింది. నిన్న ఒక్క రోజే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జనవరి 20 సాయంత్రం వరకు ఫైనల్ రిపోర్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొదటి సారిగా దరఖాస్తుల స్వీకరించింది ప్రభుత్వం. ఈ సారి రాజకీయ ప్రమేయం లేని సభ్యులను, చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే యూపీఎస్ సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశగా చర్యలు చేపట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నియమితులైన ఛైర్మన్ సహా పలువురు సభ్యులు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే జనవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది.