మొహాలీలో 300 పడకల క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం
మొహాలి : వైద్య రంగంలో.. గడిచిన 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని, 8ఏండ్లలో చేసి చూపించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్యాన్సర్ను జయించేందుకు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. పంజాబ్.. మొహాలిలోని ముల్లన్పూర్లో 300 పడకల హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ హాస్పిటల్ను ఇండియన్ గవర్నమెంట్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన ఇండిపెండెంట్ సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ రూ.660 కోట్లతో నిర్మించింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. క్యాన్సర్ అనగానే భయపడొద్దని, ధైర్యంతో పోరాడాలన్నారు. చాలా మంది క్యాన్సర్ను జయించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1.50 లక్షల హెల్త్, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అందులో 1.25 లక్షల సెంటర్లు పని చేస్తున్నాయని వివరించారు.
ప్రతి నిరుపేదకు ట్రీట్మెంట్
ప్రతి నిరుపేదకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అందజేస్తామని మోడీ తెలిపారు. హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఏయిమ్స్ నిర్మించామని, అందులో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం మెరుగైన వసతులు కల్పించామన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. హైటెక్ హెల్త్కేర్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినప్పుడే.. ప్రతీ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడని వివరించారు. క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో టాటా మెమోరియల్ సెంటర్ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ బీఎల్ పురోహిత్, సీఎం భగవంత్సింగ్ మాన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. హాస్పిటల్లో ఎంఆర్ఐ, మమోగ్రఫీ, డిజిటల్ రెడియోగ్రఫీ, ఇమ్యునోథెరపీ తదితర ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం పంజాబ్ వస్తుంటారు.