- జనరల్ చెకప్ చేయించుకుంటున్నా.. డెలివరీ టైంకు ప్రైవేట్ బాట
- పీహెచ్సీల్లో రోజుకు ఒక్క డెలివరే...
- ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్ల కొరతే కారణం
యాదాద్రి, వెలుగు : సర్కార్ హాస్పిటల్స్లో అన్ని సౌలత్లు కల్పిస్తున్నాం.. మందులూ అందుబాటులో ఉన్నాయి.. అని ఆఫీసర్లు చెబుతున్నా ప్రజలకు మాత్రం పూర్తిస్థాయిలో నమ్మకం కుదరడం లేదు. రిజిస్ట్రేషన్, ట్రీట్మెంట్ అంతా సర్కార్ హాస్పిటల్స్లోనే చేయించుకుంటున్న గర్భిణులు డెలివరీ టైంకు మాత్రం ప్రైవేట్ బాట పడుతున్నారు. అప్పు చేసైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకుంటున్నారు.
పీహెచ్సీల్లో రోజుకొకరే...
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 7.90 లక్షల జనాభా ఉంది. జిల్లాలో 21 పీహెచ్సీలు, మూడు సీహెచ్సీలతో పాటు భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉంది. జిల్లాలోని 11 పీహెచ్సీలు 24 గంటలు పనిచేస్తుండగా మరో 10 పీహెచ్సీలు 12 గంటలే పనిచేస్తాయి. ఈ పీహెచ్సీల్లో ప్రతి ఏటా 11 వేల నుంచి 13 వేల మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేయించుకొని, ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అయితే హాస్పిటల్స్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ టైంలో కొంత ఇబ్బందికి గురవుతున్నారు. దీంతో డెలివరీ టైం వరకు గర్భిణులు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. సర్కార్ లెక్కల ప్రకారమే 2021–-22లో యాదాద్రి జిల్లాలోని పీహెచ్సీల్లో కేవలం 347 మంది మాత్రమే డెలివరీ అయ్యారు. ఈ లెక్కన పీహెచ్సీల్లో యావరేజ్గా రోజుకు ఒక్కరు మాత్రమే డెలివరీ అవుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లలో 43 శాతం ప్రైవేట్కే...
యాదాద్రి జిల్లాలో 2017 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు 58,534 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరంతా డాక్టర్లు సూచించిన ప్రకారం సర్కార్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీరిలో 2,409 మంది పీహెచ్సీల్లో, 27,941 మంది సీహెచ్సీ, భువనగిరి ఏరియా హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. మరో 22,810 మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో చేరారు. మిగిలిన 5,374 మంది ఎక్కడ డెలివరీ అయ్యారన్న లెక్కలు లేవు. వీరంతా హైదరాబాద్లోని సర్కార్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం సర్కార్ హాస్పిటల్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 43 శాతం మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీ అయ్యారు. 2021-– 22 సర్కార్, ప్రైవేట్ హాస్పిటల్స్లో పోటాపోటీ డెలివరీలు నమోదు అయ్యాయి. ఈ సంవత్సరంలో పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా హాస్పిటల్స్లో 5,622 మంది డెలివరీ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో 5,560 మంది డెలివరీ అయ్యారు.
వేధిస్తున్న డాక్టర్ల కొరత
జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ఆలేరు సీహెచ్సీలో ఇద్దరు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. మరొకరు భువనగిరి ఏరియా హాస్పిటల్ నుంచి డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. భువనగిరి ఏరియా హాస్పిటల్లో 8 మంది గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ముగ్గురే పనిచేస్తున్నారు. అనస్థీషియా డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో లేరు. దీంతో గర్భిణులు ప్రైవేట్ హాస్పిటల్స్ బాట పడుతున్నారు.