భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం..భర్త మరణం తట్టుకోలేక కూతురితో సహా తల్లి ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం..భర్త మరణం తట్టుకోలేక కూతురితో సహా తల్లి ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగూడెం బాబు క్యాంప్ కాలనీలో తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొంతకాలం క్రితం భర్త మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గంప రమ్య(35) మహిళ.. తన తొమ్మిదేళ్ల కూతురితో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది.

గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కూతురు ఇద్దరూ పరిస్థితి విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ మరణాల ఉదంతాన్ని బయటకు రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను అడ్డుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.