పెండ్లి చేయట్లేదని .. తల్లిని నరికి చంపిన కొడుకు

పెండ్లి చేయట్లేదని ..  తల్లిని నరికి చంపిన కొడుకు
  • దొంగల పనిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
  • సిద్దిపేట జిల్లా బండమైలారంలో ఘటన

గజ్వేల్/ములుగు, వెలుగు: తనకు పెండ్లి చేయట్లేదని సిద్దిపేట జిల్లాలో కన్న తల్లిని కొట్టి చంపాడో కొడుకు. దొంగల పనిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కాడు. గజ్వేల్ రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ(45)కు కొడుకు ఈశ్వర్, కూతురు ఉన్నారు. భర్త కోటయ్య కొన్నాళ్ల కింద చనిపోగా, కూతురు శైలజకు పెండ్లి చేసింది. ఈశ్వర్​కు ఒక చెయ్యి లేకపోవడంతో తల్లితో కలిసి చిరువ్యాపారం చేస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత శైలజకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్​చేసి వెంకటమ్మను చంపేసినట్లు తెలిపారు. హుటాహుటిన శైలజ బండమైలారం వచ్చి చూడగా వెంకటమ్మ చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది. శైలజ ఫిర్యాదుతో ములుగు ఎస్సై విజయ్​కు మార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

అనుమానమే నిజమైంది

గజ్వేల్ రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి. తనకు పెండ్లి చేయటం లేదన్న కారణంతో కొడుకు ఈశ్వర్ దూరపు బంధువైన రాము సహాయంతో వెంకటమ్మను చంపేశారని తేలింది. ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాలు దొంగిలించటానికి వచ్చిన దుండగులే చంపేశారని నమ్మించేందుకు కడియాలు దాచారు. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు కాళ్లు, తల నరికామని ఈశ్వర్, రాములు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగలించిన కడియాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.