అశ్రునయనాలతో తల్లీకూతుళ్ల అంత్యక్రియలు .. కర్నూలు జిల్లా బస్ ప్రమాదంలో మెదక్ జిల్లా వాసులు మృతి

అశ్రునయనాలతో తల్లీకూతుళ్ల అంత్యక్రియలు .. కర్నూలు జిల్లా బస్ ప్రమాదంలో మెదక్ జిల్లా వాసులు మృతి

మెదక్, వెలుగు: ఏపీలోని కర్నూల్  జిల్లా చిన్న టేకూర్​ వద్ద ప్రైవేట్​ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి(43), చందన(23) అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామం మెదక్  మండలం శివ్వాయిపల్లిలో  అశ్రునయనాలతో జరిగాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం డెడ్​బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

కర్నూల్​ నుంచి అంబులెన్స్​లో డెడ్​బాడీలు ఆదివారం అర్ధరాత్రి శివ్వాయిపల్లికి చేరుకోగా, గ్రామంలో విషాదం నెలకొంది. తల్లీకూతుళ్లకు ఒకేసారి తండ్రి, కొడుకులు ఆనంద్​ గౌడ్,  శ్రీవల్లభ తల కొరివి పెట్టడం గ్రామస్తులను కంట తడి పెట్టించింది. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు తరలివచ్చారు. 

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్​ నియోజకవర్గ ఇన్​చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్​ మల్లేశ్ గౌడ్​  తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

వస్తాకొండూరులో అనూషకు..

యాదాద్రి: బస్సు దగ్ధమైన ఘటనలో చనిపోయిన సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ అనూష రెడ్డి డెడ్​బాడీ యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చేరుకుంది. ఈ ఘటనలో అనూష డెడ్​బాడీ గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో, ఆమె తల్లితండ్రులు శ్రీనివాసరెడ్డి, విజిత డీఎన్ఏను సేకరించారు. 

48 గంటల తరువాత రిపోర్ట్​ రావడంతో అక్కడి ఆఫీసర్లు అనూష డెడ్​బాడీని వస్తాకొండూరుకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గ్రామానికి చేరుకొని అనూష తల్లిదండ్రులను ఓదార్చారు.