బీహార్‌‌ నుంచి కనిపిస్తున్న మౌంట్‌ ఎవరెస్ట్‌

బీహార్‌‌ నుంచి కనిపిస్తున్న మౌంట్‌ ఎవరెస్ట్‌
  • ఫొటోలు ట్వీట్‌ చేసిన సింగ్‌వాహినీ గ్రామసర్పంచ్‌
  • వైరల్‌ అయిన ఫొటోలు

సింగ్‌వాహినీ: దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ కారణంగా పొల్యూషన్‌ తగ్గిపోవడంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు, ఊర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌‌ నుంచి 30 ఏళ్ల తర్వాత హిమాలయాలు కనిపించగా.. ఇప్పుడు బీహార్‌‌ రాష్ట్ర సీతామర్హీ జిల్లాలోని సింగ్‌వాహినీ నుంచి నేపాల్‌లోని మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపిస్తోంది. ఇంటి టెర్రస్‌ పైన నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపిస్తున్న ఫొటోలను గ్రామ సర్పంచి ట్వీట్‌ చేశారు. ఎప్పుడైనా వాతావరణం క్లియర్‌‌గా ఉన్నప్పుడు నేపాల్‌లోని కొన్ని కొండలు కనిపించేవని, మౌంట్‌ ఎవరెస్ట్‌ చూడటం ఇదే మొదటి సారి అని ఆమె అన్నారు. “ ప్రకృతి తనను తాను బ్యాలెన్స్‌ చేసుకుంటోంది” అని ట్వీట్‌ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్‌‌లో వైరల్‌ అయ్యాయి. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌‌ ప్రవీణ్‌ కుశ్వాన్‌ కూడా ఆ ఫొటోలను షేర్‌‌ చేశారు. బీహార్‌‌లోని ఒక ఊరి నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపిస్తుంది అని ట్వీట్‌ చేశారు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపించిందని, మళ్లీ ఇప్పుడే చూశామని గ్రామస్థులు చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఎయిర్‌‌క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) తగ్గడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెప్పారు.