
- కావాలనే పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నది: ఒవైసీ
రియాద్: భారత్పై కావాలని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వీడనంత వరకు సౌత్ ఏషియాకు ముప్పు పొంచి ఉంటుందని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘అరబ్ దేశాలకు, ప్రపంచ ముస్లిం ప్రజలకు పాకిస్తాన్ తప్పుడు సంకేతాలు పంపుతున్నది. తమది ముస్లిం దేశం కాబట్టే ఇండియా తమను వెంటాడుతున్నదని, దాడులు చేస్తున్నదని పాకిస్తాన్ అసత్య ప్రచారం చేస్తున్నది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇండియాలో 24 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారు ఇండియన్స్గా చాలా గర్వంగా ఫీలవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప ఇస్లామిక్ స్కాలర్స్ భారత్లో ఉన్నారు.
బెస్ట్ అరబిక్ ల్యాంగ్వేజీని వాళ్లు మాట్లాడుతారు’’ అని పేర్కొన్నారు. పాక్ టెర్రర్ చర్యలను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లోని ఓ కమిటీలో ఉన్న అసదుద్దీన్.. ఆ కమిటీతో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లారు. గురువారం అక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ మద్దతివ్వడం ఆపేస్తేనే.. సౌత్ ఏషియాలో సుస్థిరత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాగా.. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష బృందం గురువారం ఇండోనేషియాలో పర్యటించి, ఆ దేశ డిప్లమాట్లకు టెర్రరిజంపై భారత్ పోరు గురించి వివరించింది. ఈ సందర్భంగా టెర్రరిజంపై పోరాటంలో భారత్ కు పూర్తి మద్దతు ఇస్తున్నామని డిప్లమాట్లు ప్రకటించారు.